Land Titiling: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చెయ్యం: ధర్మాన

  • న్యాయపరమైన క్లియరెన్స్ వచ్చాకే అమలుపై ఆలోచిస్తామని వెల్లడి
  • రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కొనసాగుతోందని వివరణ
  • అత్యాధునిక టెక్నాలజీతో, పూర్తి అక్యూరసితో సర్వే జరుగుతోందన్న మంత్రి

AP Land Titiling Act Implimented From Today Onwards in 16 Offices

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చేయబోమని ఏపీ రెవెన్యూ, స్టాంప్ లు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేస్తూ.. న్యాయపరంగా క్లియరెన్స్ వచ్చాకే రాష్ట్రంలో అమలుపై ఆలోచిస్తామని వివరించారు. ఈమేరకు సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మిగతా రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో ఏపీలో కూడా అదేవిధంగా అమలుచేస్తామని, అదికూడా న్యాయపరంగా క్లియరెన్స్ వచ్చాకే అమలు చేస్తామని వివరించారు. వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూ సర్వే జరిగిందని, ఇప్పటి వరకూ మరే ప్రభుత్వం కూడా సర్వే చేపట్టలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే భూ సంస్కరణలు అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం నడుం బిగించిందని తెలిపారు. రాష్ట్రంలో 17 వేల రెవెన్యూ గ్రామలు ఉండగా.. అందులో 4 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తయిందని వివరించారు.

లేటెస్ట్ టెక్నాలజీతో సర్వే..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తిస్థాయిలో అక్యూరసీతో సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మిగతా 13 వేల గ్రామాల్లో సర్వే పనులు వివిధ దశలలో ఉన్నాయని, సర్వే మొత్తం పూర్తయ్యాక రాష్ట్రంలో ల్యాండ్ రికార్డులు అప్ డేట్ చేస్తామని తెలిపారు. ప్రతీ రెవెన్యూ గ్రామంలో ఆఫీసును ఏర్పాటు చేసి, పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తామని చెప్పారు. దీంతో గ్రామంలో కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఆధారంగా ఆటోమేటిక్ గా మ్యుటేషన్ పూర్తవుతుందని వివరించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై ఈ సందర్భంగా మంత్రి మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రైతులకు ఒక్క మేలు కూడా చేయని వారు ఇప్పుడు జగన్ మంచి చేస్తుంటే విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ చట్టంతో పేదల భూమిని జగన్ లాక్కుంటాడని ఆరోపించడం దుర్మార్గమని, ప్రతిపక్ష నేతల మాటలకు జనం నవ్వుకుంటున్నారని ధర్మాన చెప్పారు. ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు న్యాయపరమైన క్లియరెన్స్ వచ్చాకే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని మంత్రి ధర్మాన వివరించారు. 

ఏమిటీ చట్టం..?
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్- 2022 ప్రకారం ఆస్తి సర్వే చేసి ఎవరి పేరు మీద నమోదు చేస్తారో వారిదే స్థలం, ఇల్లు, పొలం, గట్రా. ఇలా నమోదైన భూములపై వివాదం నెలకొంటే వీఆర్ వో నుంచి సివిల్ కోర్టుల దాకా ఎవరూ జోక్యం చేసుకునే వీలులేదు. సివిల్ కోర్టులో దావా వేసే వీలుండదు. వీటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే బాధ్యత టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దే.. ఈ తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడా న్యాయం జరగలేదని భావిస్తే ఇక నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందే.

More Telugu News